26, నవంబర్ 2019, మంగళవారం

పొరుగింటి పుల్లగూరకు కాస్త పులుపెక్కువైంది

మూడేళ్ళ క్రితం మణిరత్నం కాఫీ తాగుతూ దేని గురించో ఆలోచిస్తూ ఉన్నారు. 

"ఇంతకీ ఏదైనా  కొత్త సినిమా తీసే ఆలోచనలో ఉన్నారా?" అడిగింది సుహాసిని. 

కథ ఏమి తట్టట్లేదు అందుకే ఆలోచిస్తున్నా.  

ఓకే బంగారం లాంటి ట్రెండింగ్ యూత్ స్టోరీస్ తియ్యండి మళ్ళీ రామాయణం, మహాభారతం జోలికి వెళ్లకుండా.  

ఇంతలో T.V లో పాట వస్తోంది. ఆ పాట అయిపోగానే సుహాసిని గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా రూంలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. 

ఆ తరువాత ఒక కథ రాసుకొని 'చెలియా' అనే సినిమా తీశాడు. ఆ సినిమా తీయడానికి టీవీ లో చూసిన ఆ పాటే ఇన్స్పిరేషన్ ఇచ్చింది.

ఆ పాట ఏంటంటే తను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయనే తీసిన 'సఖి'  సినిమా లోని 'కలలై పోయెను నా జీవితం' అనేది.  ఆ పాట లో హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో వెళ్ళి చివరికి ఎక్కడో మెడికల్ క్యాంపు లో ఉన్న తనను కలుస్తాడు.

ఇక 'చెలియా' సినిమా కూడా అంతే, ఆర్మీ బ్యాక్ డ్రాప్ పెట్టేసి హీరోయిన్ తో గొడవ పడిన హీరో  చివరకి ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడో మెడికల్ క్యాంపు లో కలుస్తాడు. ఆయన అన్ని సినిమాల్లో లాగానే హీరోయిన్ ని అద్భుతంగా చూపించారు కానీ మొహం మీద మీసాలు లేని కార్తీ ని చూడటమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.  సినిమా మరీ బాలేదా అంటే బాగుంది అది కూడా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ వరకే ఆ తర్వాతంతా బోర్. ఈ మధ్య మణి గారి సినిమాలంటే భయం వేస్తోంది చూడాలంటే, అంత చెత్తగా ఉంటున్నాయి మరి ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ఓకే బంగారం మూవీ మాత్రం ఇంకా చూళ్ళేదు. అదెలా ఉందో చూడాలి.

జనతా హోటల్ అనే మళయాళ డబ్బింగ్ సినిమా కూడా చూశాను. ఏదో అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన టైములో ఏదో ఆ టైటిల్ కలిసి వచ్చేట్లు పెడితే కాస్త క్రేజ్ వస్తుంది అనుకొని జనతా హోటల్ అని పెట్టి ఉంటారు అనుకొని ఆ సినిమా వైపు చూడలేదు. మొన్న ఏ సినిమా దొరక్క ఆ సినిమా చూశాను యు ట్యూబ్ లో. 

ఆ సినిమాలో నాకు ముందుగా నచ్చిన విషయం మ్యూజిక్. ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు నాకు బాగా నచ్చిన సినిమా అయిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' గుర్తుకు వస్తూనే ఉంది. సరే ఆ రెంటిలో ఏ సినిమా మ్యూజిక్ ఒరిజినల్ అయి ఉండచ్చు అని గూగుల్ లో గాలిస్తే రెంటికీ గోపి సుందరే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసింది.  గోపి సుందర్ మలయాళం సినిమా అయిన 'ఉస్తాద్ హోటల్' లోని background మ్యూజిక్ నే 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లో చాలా వరకు రిపీట్ చేసాడు అని అర్థమైంది రెండింటిలోనూ ముస్లిం ఫామిలీ background ఉండటం ఒక కారణం కావచ్చు. నాకు ఆ రెండు సినిమాలు నచ్చడానికి కథ ఒక కారణం అయితే రెండోది పాటలు, background మ్యూజిక్. మూడోది అందులో నటించిన నటీనటులు. ఆ సినిమా చూశాక అర్రే, ఇన్ని రోజులు జనతా హోటల్ లాంటి మంచి సినిమా మిస్ అయ్యానే అనిపించింది. 

గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలేవి అని నెట్లో వెదికితే అందులో చాలా వరకు ఈ మధ్య కాలంలో  నేనెప్పుడూ వినే పాటలు, నాకు నచ్చిన పాటలు అతను కంపోజ్ చేసినవే అని తెలిసింది. అందులో కొన్ని మజ్ను, నిన్ను కోరి, ఊపిరి, మజిలీ, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు లోని సినిమా పాటలు. 

ఒకే సంవత్సరంలో 25 సినిమాలకు సంగీతం అందించిన ఘనత కూడా ఉందట ఇతని ఖాతాలో. 

ఇక నేను రుచి చూసిన పొరుగింటి పుల్లగూరలో బాగా పులుపు ఎక్కింది jackpot అనబడే మరొకటి. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో వచ్చిన కామెడీ యాక్షన్ సినిమా. యాక్షన్ అని ఎందుకు అన్నానంటే రెగ్యులర్ తెలుగు, తమిళ హీరోల్లాగానే జ్యోతిక కూడా విపరీతమైన బిల్డప్ లతో ఫైట్స్ చేస్తుంది కాబట్టి. మైండ్ లెస్ కామెడీ అంటారు కదా అలాంటి సినిమా ఇది. మొదటి సగం కాస్త కామెడీ గా బానే ఉంటుంది రెండో సగం బాగా సాగదీయడంతో నీరసం వచ్చేస్తుంది. సగం సినిమా చూసేసి మిగతాది చూడకపోవడం బెటర్ మన F2 సినిమా లాగా. 

18, నవంబర్ 2019, సోమవారం

ఈ పాపం ఎవరిది? - అక్కడా ఇక్కడా విన్న మంచి కథలు

అనగనగా అదేదో ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని ఏలే రాజుగారికి ఏడుగురు కొడుకులు ...  ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ ఉన్నదంతా ఊరోళ్ళకు పంచిపెట్టే టైపు. అందువల్ల  ప్రతీ రోజూ పేదవాళ్లకు అన్నదానం చేసేవారు. 

ఒక  రోజు మధ్యాహ్నం భోజనం వండి వడ్డించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఒక  గద్ద కాళ్ళతో  ఒక పాముని పట్టుకొని గాల్లో  ఎగురుతూ వెళ్తోంది.  ఆ  పట్టుకున్న  పాము  నోటి నుండి జారిన  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న  అన్నం మీద  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు. ప్రతీ మెతుకు మీద తినబోయే వారి పేరు ఉంటుంది అంటారుగా ఆలా ఆ విషం పడ్డ మెతుకులమీద ఒక పేద బ్రాహ్మణుడి పేరు రాసి ఉందేమో మరి, ఆ భాగం  తిన్న ఆ  పేద బ్రాహ్మణుడు  చనిపోయాడు.  

ఈ  వార్త  రాజుగారికి  చేరింది.   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు. పిల్లిని చంపిన పాపమే గుడి కట్టించినా పోదు అంటారు అలాంటిది నా వల్ల ఒక బ్రాహ్మణుడే చనిపోయాడు. దానికి తోడు పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి అంటారు కాబట్టి ఈ పాపం నాకు మాత్రమే చుట్టుకుంటే పర్లేదు, నా రాజ్యానికి కుటుంబానికి వంశానికి చుట్టుకోకుండా చూడు తండ్రీ అని దేవుడిని వేడుకున్నాడు.   

పైన అకౌంట్స్ రాసుకునే చిత్రగుప్తుడికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ  బ్రాహ్మణుడు  చనిపోవడానికి  కారణం  ఎవరు ?

విషం వదిలిన పామా ? 

లేక పాముని పట్టుకున్న గద్దా ? 

రాజా ? 

వంట చేసిన మనిషా ?    

వడ్డించిన  వ్యక్తా ?  

మరి ఈ  పాపాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలి ? 

కావాలని  ఎవరూ   ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు.

అందుకని అతని మేనేజర్ అయిన యమ  ధర్మరాజును  అడిగాడు.  ఆయనకు కూడా అది భేతాళ ప్రశ్న లాగే అనిపించింది. సరే కాస్త అలోచించి చెప్తాను అని అందరు మేనేజర్స్ లాగే అప్పటికి తప్పుకున్నాడు.  

మర్నాడు దారిన  పోతున్న బ్రాహ్మణులు  కొందరు  అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  అక్కడున్న సూర్యకాంతం ని అడిగారు .  

ఆవిడ వారికి  దారిని  చూపుతూ  “ బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి బాపనోళ్ళు అంటే పడదు.  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపించేశారు. మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర పడ్డాయేమో ఆలోచించుకొని వెళ్ళండి నాయనా? ఊపిరుంటే ఉప్పయినా అమ్ముకొని బతకచ్చంటారు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అని ఆ రోజుకు తన కడుపు నింపుకుంది  ఖాళీ కడుపులతో ఉన్న బ్రాహ్మణుల మనస్సుల్లో అనుమానాలు మొలకెత్తించి. 

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించిన ధర్మరాజు గారు “చిత్రగుప్తా! యాదృచ్చికంగా ఏదైనా జరిగినప్పుడు దానిని ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యక్తులు చేయనప్పుడు అనవసరంగా ఆ వ్యక్తులకు అంటగట్టి, వారిని నిందించే  వారికే ఆ  మొత్తం  కర్మ  ఫలం చెందాలి అని  శాస్త్రాలు చెబుతున్నాయి అదే ధర్మం కూడా, కాబట్టి మొత్తం  పాపం  అంతా  ఆమె అకౌంట్ లో వెయ్యి”  అన్నారు.

మొత్తానికి నీతి ఏమిటంటే అనవసరంగా ఇతరులపై బురద చల్లడానికి ప్రయత్నించకండి అది మీ నెత్తి మీదే పడచ్చు అని.  దీనినే కర్మ ఫలం అదీ ఇదీ అంటారు కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, వేదాలు అవీ తిరగేసిన వారు.

P.S: పాత సినిమాల్లో ఏదైనా గయ్యాళి భార్య లేదా గయ్యాళి అత్త  లాంటి పాత్ర ఉంటే వారు గయ్యాళి అని చూపెట్టడానికి అనవసరంగా రెండు మూడు  సీన్స్ పెట్టాలి దానికో రీల్ వృధా ఖర్చు ఎందుకని ఆ పాత్రకు సూర్యకాంతాన్ని తీసుకునేవారట. ఆల్రెడీ ఆవిడ అలాంటి పాత్రలు ఎన్నో సినిమాల్లో చేసింది కాబట్టి ఆవిడని తెర మీద చూడగానే ఈ పాత్ర గయ్యాళి పాత్ర లేదంటే చాడీలు చెప్పే పాత్ర అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు కాబట్టి. అందువల్ల నేను కూడా సూర్యకాంతం అనే పేరుని వాడాను తప్పితే ఆ పేరు గల (ఎవరైనా అలాంటి పేరు గల వాళ్ళు ఈ పోస్ట్ చదువుతుంటే..ఛాన్స్ ఉండకపోచ్చు ఒక వేళ ఉంటే ) వాళ్లను కించపరచాలని కాదు. 

13, నవంబర్ 2019, బుధవారం

అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు

ఎప్పుడూ సినిమాలు, సరదా కబుర్లే కాకుండా ప్రస్తుతానికి వార్తల్లో బాగా నలుగుతున్న 'ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు' అనే కాన్సెప్ట్ మీద నా అభిప్రాయం రాద్దామనుకున్నాను. ఈ ఇంగ్లీష్, తెలుగు మీడియం చదువుల డిబేట్ ఎప్పటికీ తీరేది కాదు కానీ నా స్టాండ్ అంటూ ఒకటి ఏడ్చి ఉంటుంది కదా అది రాద్దామని ఈ ప్రయత్నం.  ఇలాంటి టాపిక్స్ 'నా కప్ అఫ్ టీ' కాదు అని నాకు తెలుసు కానీ ఏదో రాద్దామని చిన్న ప్రయత్నం అంతే

'దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ'  అని ఒక సారి సినిమా హీరో నాగార్జున T.V ఇంటర్వ్యూ లో అన్నాడు. దాని అర్థం ఏమిటన్నది తెలీదు కానీ అబ్బో వీడికి భలే ఇంగ్లీష్ వచ్చన్నమాట అని నా మిత్రులంతా అనుకునేవారు. మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీష్ మాట్లాడాడా అని వాళ్ళు మమ్మల్ని దెప్పి పొడిచేవారు. ఈ విషయం లో మేము ఏమీ మాట్లాడలేకపోయాం. అంటే అర్థం ఏమిటి తెలుగు వచ్చిన వాడికంటే ఇంగ్లీష్ వచ్చిన వాడికే మనం అట్ట్రాక్ట్ అవుతాం అని

కాబట్టి నా ప్రియాతి ప్రియమైన తెలుగు అభిమానులారా, ఎక్కువ మంది ప్రజలు అమ్మ పాల లాంటి  తెలుగు కంటే ఎంగిలిపీసు అయినా ఇంగ్లీష్ వైపుకే కాస్త ఎక్కువ మొగ్గు చూపుతారు అని నా ఉద్దేశం.  నా వరకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని సబ్జక్ట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండి తీరాలి, అలాగని మాతృ భాషను తక్కువ చెయ్యాలని కాదు కానీ తెలుగు కూడా కంపల్సరీ సబ్జెక్టు గా పెట్టాలి. అది కూడా  ఏదో మొక్కుబడి కోసం సంస్కృతం సబ్జెక్టు పెట్టినట్లు కాకుండా. కుండ లో ఉండే కూడు అట్టాగే ఉండాలి, పిల్లాడు మాత్రం గుండులా తయారు కావాలి అంటే కుదరదు. తెలుగు మీడియం ను పక్కకు తోసేసి, తెలుగును మాత్రమే ముందుకు తీసుకెళ్లాలి, వాటితో పాటు మిగిలిన సబ్జక్ట్స్ ఇంగ్లీష్ లో భోదించాలి. 

మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటాలంటే ఖచ్చితంగా మొక్కగా ఉన్నప్పుడే ఇంగ్లీష్ అందిస్తూ ఉండాలి, మాను అయిన తర్వాత అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మొక్క, మాను చీప్ తెలుగు వర్డ్స్, ఎవడికి అర్థమవుతాయి ఈ కాలంలో నా పిచ్చి కాకపోతే. 

ఏం, నిజ్జంగా సర్కార్ స్కూళ్ళలో చదువుకొని అంతర్జాతీయంగా తమ సత్తా చాటిన వాళ్ళు లేరా అని అనొచ్చు కానీ వారి సంఖ్య కూడా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటంత మాత్రమే అన్నది అక్షరాలా నిజం. 

చిన్నప్పుడు గవర్నమెంట్ బడుల్లో చదువుకున్నాను కాబట్టి ఆ అనుభవాలతో చెప్తున్నాను. సైన్స్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులన్నీ తెలుగులో చదివి పౌనపున్యం, ఆరోహణ, అవరోహణ, కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు, కక్ష్య, భూపరిభ్రమణం, వైశాల్యము, విస్తీర్ణం, లంబ కోణం అని చదువుకున్నాను, ఆ తర్వాత కాలేజీ రోజులకు వచ్చాక తర్వాత వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో సరిగ్గా తెలీక ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కుర్రాళ్లతో మాట్లాడేప్పుడు కొన్ని సార్లు ఎన్నో విషయాలు తెలుగులో తెలిసి ఉండీ వాటిని ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తీకరించాలో తెలీక ఊరుకుండిపోయాను. 

డిగ్రీ  వరకు తెలుగు మీడియం లో చదివి,  ఒక్కసారిగా M .C. A ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇబ్బందిపడ్డాను. అందులోనూ కంప్యూటర్ ఆర్గనైజషన్ అని ఒక బుక్ ఉండేది, అందులో మొదటి చాఫ్టర్ చదివి అర్థం చేసుకునే లోపే మొదటి సెమిస్టరు అయిపోయింది. ఏదో అత్తెసరు మార్కులతో పాస్ అయి బయటపడ్డాను. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి ఉంటే అన్ని ఇబ్బందులు ఉండేవి కాదు అని నా అభిప్రాయం. 

అంతెందుకు, తెలుగు మీడియం లో చదివి ఏంతో టాలెంట్ ఉండి  కూడా ఇంగ్లీష్ సరిగ్గా లేక కింది స్థాయిలోనే మిగిలి పోయిన వాళ్ళను చూశాను, టెక్నికల్ గా స్ట్రెంగ్త్ లేకపోయినా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు బాగా రావడం వల్ల మానేజేర్స్ గా అధికారాన్ని చెలాయించిన వాళ్ళను చూశాను.

కాలేజీల వరకు తెలుగు మీడియం లో చదివి, వీసాల కోసం PTE/ IELTS/ TOFEL/ GR E  లాంటి ఎగ్జామ్స్ లో తెచ్చుకోవాల్సినన్ని మార్కులు తెచ్చుకోలేక యెంత మంది ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికీ నేను రోజూ చూస్తూనే ఉన్నాను. నా వరకు నేను PR కు  అప్లై చేయడటం కోసం 3 నెలల పాటు  ఇష్టం లేకపోయినా కష్టపడి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతూ, ఇంగ్లిష్ మాత్రమే వింటూ, ఇంగ్లీష్ మాత్రమే తింటూ, ఇంగ్లీష్ నే తాగుతూ వచ్చాను. అసలు ఆ మూడు నెలలు ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదంటే నమ్మండి కాకపోతే ఆ 3 నెలల తర్వాత మళ్ళీ తెలుగుకు షిఫ్ట్ అయినప్పుడు సంతలో తప్పిపోయి చివరకు అమ్మ ఒడికి చేరిన బిడ్డ లాగా తెగ ఆనంద పడ్డాను

ఒక వేళ గవర్మెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మొదట అక్కడ పనిచేసే టీచర్స్ కి తగిన శిక్షణ ఇవ్వాలి. నేను M.C.A చదివే రోజుల్లో చూసాను అక్కడ భోదించే వారికే సరిగ్గా ఇంగ్లిష్ వచ్చేది కాదు, ఇక స్టూడెంట్స్ కి వాళ్ళేం నేర్పుతారు. 

ఇకపోతే మాతృ భాష మృత భాష అయిపోతుంది అని తెగ గగ్గోలు పెడుతున్న వారంతా నిజంగా తెలుగు మీద అంత ప్రేమే ఉండి ఉంటే తెలుగు భాషను బతికించడానికి మార్గాలు వెతికితే బాగుంటుంది.  ఆల్రెడీ తెలుగులో చదవడం వచ్చిన వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు మీడియం తర్వాత, అసలు తెలుగు చదవడం అనేదే నామోషీ అయిపోయింది ఈ కాలం లో. ఎంతమంది అమ్మా, నాన్న అని పిలుస్తున్నారు వారి తల్లిదండ్రులను ఈ కాలంలో? అంతెందుకు మొన్నటి దాకా అమ్మా, నాన్న అని పిలిచినా వారే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సినప్పుడు మా మమ్మీ, డాడీ అంటూ మొదలెడతారు.

ఏ ఎండకా గొడుగు పట్టడం ఈ రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే Y.S.R పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు,  Y.S.R పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే తెలుగు దేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు. చాలా మంది తెలుగు చచ్చిపోతోంది అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు గానీ వాళ్ళ ఇళ్ళు మొత్తం ఇంగ్లీష్ తోనే నిండిపోయి ఉంటుంది. గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్లో కాదు అన్నది వీరి కోరిక. 

ఇంకా ఏమైనా అంటే 'ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష కొన్నేళ్ళకు అంతరించి పోతుందని ఫలానా అధ్యయనాల్లో తేలింది' కాబట్టి విద్యా భోధన మాతృభాషలోనే జరగాలి అని వాదిస్తారు. మరి ఇలా అన్నవాళ్లంతా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళు మొదలైనప్పుడు ఏమయ్యారో తెలీదు. తెలుగు వద్దనడం లేదు, తెలుగు తప్పక నేర్పించండి, కానీ సైన్స్, మాథ్స్, సోషల్ లాంటివి ఇంగ్లీషులో నేర్పించండి.

ఏది ఏమైతేనేం, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ఇంగ్లీష్ మీడియం చదువులు సర్కారు బడుల్లోకి తీసుకొచ్చేశాం మీ ఇష్టమైంది మీరు చేసుకోండి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు జగన్ గారు, ఏది ఏమైతేనేం ఇల్లలకగానే పండుగ కాదు, ముందుండి ముసళ్ల పండుగ ఈ ఇంగ్లీష్ మీడియం రాకతో ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతాయో సర్కారు స్కూళ్లలో?

కాకపోతే ఒక్కటి నిజం మన తెలుగంత తియ్యనిది ఈ లోకం లో మరొకటి లేదు, కాకపోతే  చద్ది అన్నం కంటే పిజ్జా, బర్గర్లకే డిమాండ్ ఇక్కడ. జీవితంలో ఎదగాలనుకుంటే మాత్రం తెలుగును తుంగలో తొక్కడమో, గంగలో వదిలేయడమో చెయ్యాల్సిందే.  అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు, అసలే పోటీ ప్రపంచం ఇక్కడ. 

'నా కప్ అఫ్ టీ' కాని విషయం మీద ఏదేదో రాసి మీకు బొప్పి కట్టించి ఉంటాను వెళ్ళి టీ పెట్టుకు తాగండి తల నొప్పి తగ్గడానికి. 

10, నవంబర్ 2019, ఆదివారం

ఈ మధ్య చూసిన వాటిల్లో నాకు నచ్చిన రెండు తెలుగు సినిమాలు

నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లు, నేను సినిమా చూసి వాటి గురించి రాసేది ఒక ఏడాది లేటు.

నాకు మా చెడ్డ  అలవాటు ఉంది. ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు ఆ సినిమా గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి అని అనిపిస్తుంది, అందుకే ఈ బ్లాగ్ ని ఎన్నుకున్నాను. చూసినవి కొత్త వో పాతవో వాటి గురించి నాలుగు ముక్కలు మీతో పంచుకుంటే అదో తుత్తి నాకు.

రంగస్థలం, జెర్సీ అనే రెండు మంచి తెలుగు సినిమాలు చూశాను, ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటే అస్సలు తమిళ్ సినిమాల వైపు వెళ్ళాలి అనిపించదు. 

దర్శకుడు బోయపాటి ఒక ఇంటర్వ్యూ లో ఇలా అన్నాడు, "విలన్ ను హీరో కొట్టాలి అనుకున్నప్పుడు కొడితే ఎమోషన్ పండదు, ఇప్పుడు హీరో కొడితే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించాలి అప్పుడే ఎమోషన్ పండుతుంది, అలానే ఉంటాయి నా సినిమాలో ఫైటింగ్స్ అన్నీ అని", కానీ వినయ విధేయ రామ లో లెక్క తప్పింది. ఆ  సినిమా నిండా ఫైట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడా మనం ఇన్వాల్వ్ అవ్వము, అవ్వాలని అనిపించదు. 

కానీ రంగస్థలం లో సుకుమార్ ఆ involvement  ఎలా ఉంటుందో చూపించాడు. అందులో ఉండేది 3 ఫైట్స్ అనుకుంటా. మూడూ కూడా ఎమోషన్ క్యారీ చేసేవే.

మొదటిది జాతరలో సమంతాను వాడెవడో ఏదో అని ఏడిపించాడని

రెండోది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి తప్పుగా మాట్లాడారని

మూడోది వాళ్ళ అన్నను కాపాడుకోవడం కోసం చీకట్లో ఫైట్

ఈ మూడు ఫైట్స్ విషయం లో ఇంకా కొట్టేయ్ వాణ్ని అని ప్రేక్షకుడు అనుకుంటూ ఇన్వాల్వ్ అవుతాడు, నా విషయంలో అలానే జరిగింది. చిన్నప్పుడు ఫైటింగ్ సీన్స్ అంటే నచ్చేవి కానీ, తర్వాత అంతగా నచ్చేవి కావు. 

చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. రామ్ చరణ్ యాక్షన్ ను మగధీర తర్వాత అంతో ఇంతో ఆస్వాదించగలిగింది ఇందులోనే. ఘన శక్తి నక్షత్రం అని వాళ్ళకు వాళ్ళు పేరు తగిలించుకున్నందుకు మొదటి సారి మన్నించెయ్యచ్చు.  

సినిమా పరిభాషలోని 'పే ఆఫ్' బాగా క్యారీ అయింది ఈ సినిమా విషయంలో. ఉదాహరణకు 'ప్రెసిడెంట్ గారు' అనేదే నా పేరు, నా అసలు పేరు ఈ ఊరెప్పుడో మరచిపోయింది అంటాడు జగపతి బాబు గర్వంగా. 

నెక్స్ట్ సీన్ లోనే  "ఫణీంద్ర భూపతి గారు" అని వెటకారంగా పేరు పెట్టి పిలిచి గాలి తీసేస్తాడు రామ్ చరణ్.

కాకపోతే అంత గొప్పగా చూపిస్తూ వస్తున్న జగపతి బాబు కారెక్టర్ ను చివరికి ఆటలో అరటిపండును చెయ్యడాన్ని జీర్ణించుకోవడం కష్టమే.  

చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన తెలుగు సినిమా ఇది, నచ్చనిది అంటూ ఏమీ లేదా ఈ మూవీ లో అంటే ఉంది, అదే ఐటెం సాంగ్, అలాగే ఎన్నో పాత సినిమాల్లో చూసిన కథే. ఈ తరం కుర్రకారు చూసి ఉండరు కానీ 'ఈ తరం ఫిల్మ్స్' బానర్ మీద ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం లో పాతికేళ్ళ కిందట వచ్చిన 'ఎర్ర మందారం' సినిమా చూడండి బాగుంటుంది.

ఎప్పుడూ నలగని బట్టలు వేసుకునే మహేష్ బాబు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.... జస్ట్ ఫర్ ఫన్.


ఇదే కాదు, ఈ మధ్య కాలం లో నచ్చిన మరో సినిమా జెర్సీ. కాకపోతే పైన చెప్పుకున్న "ఘన శక్తి నక్షత్రం" లాంటి మాస్ హీరో లేడు, అలాగే అర్జున్ రెడ్డి లాంటి యూత్ ని అట్ట్రాక్ట్ చేసే సినిమా కాదు పైగా కేవలం "సహజ నక్షత్రం" సినిమా కాబట్టి కమర్షియల్ గా 100 కోట్ల చిత్రం కాకపోవచ్చు కానీ ఇలాంటి సినిమాలను కలెక్షన్ లెక్కలతో కొలవకూడదు.

కొడుకు జెర్సీ అడిగినప్పుడు, పదరా కోటి సర్కిల్ లో ప్లాట్ఫారం మీద 50 రూపాయలు పెడితే ఒరిజినల్ లాంటిదే వస్తుంది అని ఫ్రెండ్ సలహా ఇచ్చినప్పుడు, "తన వయసుకు తెలియకపోవచ్చు కానీ, నా మనసుకు అర్థమవుతుంది ఏం ఇచ్చానో" అంటాడు నాని. ఇలాంటి మంచి మంచి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో.

చాలా మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, రైలు కూత కోసం వెయిట్ చేసి తన సంతోషాన్ని గట్టిగా అరుస్తూ అనుభవిస్తాడు చూడండి అది. ఇలాంటిదే ఒక చిన్న బిట్ తొలిప్రేమ సినిమాలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ చెట్టు చాటుకి వెళ్ళి డాన్స్ చెయ్యడం. 

నానితో పాటు ఈ సినిమా డైరెక్టర్ అయిన గౌతమ్ గారి గురించి చెప్పకపోతే అర్థమే లేదు ఈ పోస్ట్ కి. చాలా బాగా తీశాడు మూవీ ని, ఇదే కాదు ఇతని మొదటి సినిమా 'మళ్ళీ రావా' కూడా బాగుంటుంది అందులోని అక్కినేని ఆణిముత్యాన్ని లెక్కలోకి తీసుకోకపోతే. ఈ గౌతమ్ గారు కలెక్షన్ అనే సుడిగుండంలోకి వెళ్ళాలని ఆలోచించకుండా ఉంటే మరిన్ని మంచి సినిమాలు ఆశించచ్చు ఇతని నుంచి.

ఇలాంటి క్రికెట్ బ్యాక్ డ్రాప్ తోనే మజిలీ అని మరో సినిమా అదే టైంలోనే రిలీజ్ అయింది, ఆ సినిమా కూడా బాగుంది అన్నారు కానీ అందులోని మరో అక్కినేని ఆణిముత్యానికి బెదిరి ఆ సినిమా చూడాలనే మూడ్ రాలేదు.

P.S: మొన్నా మధ్య కామెంట్స్ లో మెగా స్టార్ ను విన్నకోట నరసింహారావు గారు "ఘన నక్షత్రం" అని అనువదించారు , నేను ఇంకాస్త ముందుకెళ్లి మెగా పవర్ స్టార్ ను "ఘన శక్తి నక్షత్రం" అని నానిని 'సహజ నక్షత్రం' అని మెన్షన్ చేశాను..... జస్ట్ ఫర్ ఫన్.

5, నవంబర్ 2019, మంగళవారం

శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అవుతాడా?

మా ఆఫీసులో శాంత మూర్తి అని పేరుకు తగ్గట్లు ప్రశాంతంగా, శాంతంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు . 

"సారీ మేష్టారు, కాఫీ మీ మీద పడింది, అసలే  మీరు ఇవాళ కొత్త డ్రెస్ వేసుకొచ్చారు." అని ఎవరైనా కాఫీ ఒలకబోసినా ఉతికేస్తే పోతుంది, దానిదేముంది అంటాడు. 

ఏమనుకోకండి, ఇవాళ మీ లంచ్ బాక్స్ లో బిర్యాని తెచ్చారని తినేసాను అని ఎవరైనా అంటే,బయటికి వెళ్ళి తిని వస్తాను, దానిదేముంది అంటాడు.

మీకు కోపం రాలేదా? అని అడిగితే 'ఎందుకు కోపం, పాపం అతనికి నా కంటే ఎక్కువ ఆకలి వేసినట్లు ఉంది, అందుకే తిన్నాడు' అని అనుకొని మన్నించే రకం. 

అంతే కాదు, ఎవరైనా పొరపాటున తిట్టినా కోపం రాదు, అతన్నే కాదు వాళ్ళింట్లో వాళ్ళను తిట్టినా అస్సలు కోపం రాదు దున్నపోతు మీద వాన పడినట్లు దులుపుకు వెళ్తాడే తప్ప చలించడు. 

మొన్న ఒక రోజు లంచ్ టైం లో పొరపాటున సైరా సినిమా లాస్ వెంచర్ అట కదా, ఇక చిరంజీవి సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నాను.

అంతే, ఎప్పుడూ కోప్పడని ఆ శాంత మూర్తి, మా బాస్ ని అలా అంటావా అని కోపంతో రగిలిపోయాడు, కల్లు తాగిన కోతిలా చిందులేయడమే కాక ఆల్కహాల్  తాగిన ఆంబోతులా రంకెలేశాడు. 

అతను చిన్నప్పటి నుంచి విన్న బూతులన్నీ ప్రయోగించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అయ్యాడు. 

P.S: మొన్న ఒక పోస్టులో చిరంజీవిది ఈతాకు యవ్వారం అన్నానని ఒక మూర్ఖ అభిమానికి పిచ్చి కోపం వచ్చి నన్నొక పనికి రాని వాడి కింద జమకడుతూ కామెంట్స్ పెట్టాడు ఫేస్బుక్ లో.  దాని మీద అల్లిన కథనం పైది. ఒక వేళ నేను చిరంజీవినే డైరెక్ట్ గా అన్నా ఆయన పట్టించుకోరు, ఎందుకంటే ఆయన నిండుకుండ లాంటి వారు. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అంటారు చూశారా ఆ టైపు, ఇదిగో ఏమీ లేని ఈ ఖాళీ ఎంగిలి ఇస్తరాకు గాళ్ళే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటివి స్పోర్టివ్ గా తీసుకోలేని వారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. "పేరు గొప్ప ఊరు దిబ్బ" అన్నట్లు అంతో ఇంతో చదువుకునే ఉంటారు కానీ దానికి తగ్గ ప్రవర్తన ఉండదు. ఇంత చదువు చదివి ఏం లాభం? సద్విమర్శలకు అదే పద్దతిలో సమాధానాలివ్వడం చేయాలి అంతే కానీ బూతులు తిట్టడం పద్దతి కాదు అని ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. అప్పట్లో గోడ మీద  ఉన్న వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టడం, బురద చల్లడం చేసేవాళ్ళు , ఇప్పుడు అదే పని సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు అంతే తేడా. 

ఎంతసేపూ సినిమాల్లోనే హీరోలు ఉంటారని, అలాంటి సినిమా హీరోలకి అభిమానులుగానే ఉండిపోదాం, అమ్మ, నాన్న, కుటుంబం కంటే ఈ సినిమా హీరోలే మనకు ముఖ్యం అనుకుంటారే తప్ప సరిగ్గా ప్రయత్నిస్తే మనమూ ఏదో ఒక రంగంలో హీరో అవ్వచ్చు అని విస్మరిస్తున్న ఈ శాంత మూర్తి లాంటి వారికి జాలితో ఈ పోస్ట్ అంకితం. 

1, నవంబర్ 2019, శుక్రవారం

రివర్స్ ట్రెండ్ - బ్యాన్డ్ బాజా బారాత్

గురువు గారూ, మీరిది విన్నారా?

ఏంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుందిరా శుంఠా?

శూన్యం లోకి చూస్తూ దేవుడితో మాట్లాడే మీకు ఇవి తెలియకపోవటమేమిటి స్వామీ? 

అసలు విషయం చెప్పకుండా నస పెట్టక క్లుప్తంగా వివరించు. 

అదే స్వామీ,మొన్న రెండు విషయాలు జరిగాయిగా వాటి గురించి. 

ఏదీ మన గోలయ్య చేతిలో గుత్తి పట్టుకొని వదిలిన 'రోలర్' సినిమా పోస్టర్, కాంరోగాల్ ఖర్మ వదిలిన 'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' సినిమా టీజర్ ఇవేగా. 

అవి కాదు స్వామీ, రివర్స్ లో జరిగిన రెండు విషయాలు. 

"ఎప్పుడూ ఈ చేతిలోకి డబ్బు రావడమే తప్ప ఈ చేతిలోంచి డబ్బు పోగొట్టుకోవడం తెలీదు అలాంటిది మొన్న గోవా వెళ్ళినప్పుడు కాసినో లో కాసులు మొత్తం పోగొట్టుకోవడం వీడికి ఎలా తెలిసిందబ్బా?', దాంతో పాటు 'కొంపదీసి నాకున్నవక్ర దశ  మారడానికి రెమెడీ ఏదో కనుక్కోవడానికి అదే గోవా లోని 'గోచీ బీచీ స్వామి' ఆశ్రమానికి మారు వేషంలో వెళ్ళడం వీడికి తెలిసిందా ఏమిటి?"

ఏమిటి స్వామీ, శూన్యం లోకి చూస్తూ పలకరు?

అదే, నువ్వు దేని గురించి చెబుతున్నావో అది తెలుసుకోవడానికి. 

సరే చెప్తాను వినండి. జింకను వేటగాడు చంపడం, యువతి మీద యువకుడు ఆసిడ్ దాడి చేయడం మనం వింటూ ఉంటాం కదా? 

అవును అది లోకంలో సహజం గా జరుగుతున్నవే కదా నాయనా?

కానీ తన మీద వేటకు వచ్చిన వేటగాడిని జింక చంపడం, గొడవపడిన ప్రియుడిపై ప్రియురాలు ఆసిడ్ పోయడం జరిగాయి స్వామీ నిన్న. 

మరిప్పుడు ఏమంటావు నాయనా? 


మీరు ఈ మధ్యే ఈ లోకానికి పోగాలం దాపురించింది అన్నీ రివర్స్ లో జరుగుతాయి అన్నారు, దీని గురించే అనుకుంటాను కదా గురూజీ. 

సరిగ్గా ఊహించావు శిష్యా?

ఎందుకిలా జరుగుతున్నాయి స్వామీ?

వీటికి కారణం గురుడు, శుక్రుడు వారి వారి కక్షలు మార్చుకొని తిరుగుతున్నారని గ్రహాల స్థితిని ఔపోసన పట్టిన నా మేధస్సు చెబుతోంది.  

మరి దీనికి రెమెడీ ఏమీ లేదా స్వామీ?

'అసలే కాసులు లేక కట కట లాడుతున్నాను, కాసులు రాల్చే ఐడియా ఇచ్చావురా శిష్యా, ఈ దెబ్బకు బొక్క పడిన బొక్కసాన్ని కాసులతో పూడ్చచ్చు ఈ ఐడియా సరిగ్గా వర్కౌట్ అయితే''

మళ్ళీ శూన్యం లోకి చూస్తూ దేవుడితో మాట్లాడుతున్నారు కదా స్వామీ?

అవును నాయనా, దీని కోసం 'రివర్స్ ట్రెండ్ - బ్యాన్డ్ బాజా బారాత్' అనే హింగ్లీష్ యాగం తలపెట్టాలి, కాబట్టి ఈ విషయాలన్నీ మన భక్తులకు తెలియజేస్తూ విరాళాలు పంపమని చెప్పు. 

ఏ విషయాలు స్వామీ?

అదేరా నేను రెమెడీ కోరడం, కాసినో లో కాసులు పోగొట్టుకోవడం. 

ఏమిటి స్వామీ మీరనేది?

అదే  శిష్యా, రివర్స్ లో జరిగిన ఆ రెండు  విషయాలు, అలాగే నువ్వు లోక కళ్యాణానికి నన్ను రెమెడీ కోరడం, అసలు ఎవరి మీదా ఆసిడ్ దాడులు జరగకుండా చూడటం లాంటి వాటి కోసం యాగాన్ని చేస్తున్నామని వివరిస్తూ వాట్సాప్ చెయ్యి మన భక్తులకు.

అలాగే స్వామీ..కానీ చిన్న అనుమానం. 

కాంరోగాల్ ఖర్మ సినిమాకి ముందు వివాదాలు రావడం, విన్న ప్రతీ విషయానికీ నీకు అనుమానాలు రావడం చాలా కామన్ శిష్యా. అడుగు ఆలశ్యం చేయక అవతల నాకు దేవుడి సేవ కి వేళయ్యింది. 

అసలే ఈ సోషల్ మీడియా వచ్చాక మన స్వామీజీల మీద విమర్శలు ఎక్కువయ్యాయి. యాగాలు, హోమాలు అంటే నమ్ముతారా?

సోషల్ మీడియాలు, సైన్స్ మీడియాలు అంటూ ఇంకో పది మీడియాలు వచ్చినా ఈ జనాల్లో ఉండే పాపభీతి ఎప్పటికీ పోదు అలాగే మెజారిటీ జనాల్లో ఉండే ఆ వేపకాయంత వెర్రి తగ్గేదాకా మనకు ఎదురు ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ భూమి అంతమయ్యేదాకా మా లాంటి స్వామీజీలకు భక్తుల కొరత ఉండదు.  

మిమ్మల్ని నమ్మినా, విరాళాలు ఎవరూ పంపక పోతే? 

జనాలు ఎవరూ చూడకపోతే అని కాంరోగాల్ ఖర్మ 'ఐ స్క్రీం' సినిమా తర్వాత అలోచించి ప్రయత్నాలు ఆపివుంటే ఇప్పుడు  'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' అంటూ మరో సినిమాతో వచ్చేవాడు కాదు. ఆయనెంత చెత్త సినిమాలు తీస్తున్నా చూసే వాళ్ళు ఉన్నట్టే మనకూ విరాళాలు పంపే భక్తులు ఉంటారు. ఎప్పుడూ వినేదే కానీ నా మాటల్లో మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో 'ప్రయత్నం ఆగిపోవాల్సింది ప్రాణం పోయినప్పుడే,  నీకు నువ్వుగా కాదు' . 

అర్థమైంది స్వామీ. 

వెళ్ళిరా నాయనా, 'శుభం భూయాత్, రివర్స్ ట్రెండ్ బ్యాన్డ్ బాజా బారాత్'  

P.S:  వేటగాడిని జింక చంపడం, యువకుడిపై యువతి ఆసిడ్ దాడి అన్న వార్తలు ఒకే రోజు చదివిన తర్వాత వీటి మీద సరదాగా ఏదో రాద్దామని రాసిందే తప్ప ఎవ్వరినీ కించపరచడానికి కాదని మనవి.